- ప్రజల ప్రాణాలను కాపాడి.. కర్నల్, మేజర్, ఇద్దరు జవాన్లు, ఓ ఎస్ఐ మృతి
- ఇద్దరు ఉగ్రవాదులు హతం
- జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్
శ్రీనగర్, మే 3: తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న పౌరులను క్షేమంగా విడిపించి చివరికి అమరులయ్యారు ఐదుగురు భద్రతా సిబ్బంది. విధి నిర్వహణలో వీరు చూపిన ధైర్య సాహసాలను చూసి దేశమంతా సెల్యూట్ చేసింది. ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉన్న హంద్వారా ప్రాంతంలో లష్కరే తాయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు గురువారం బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఆయితే అదే సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఛాంగిముల్లా గ్రామంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో కర్నల్ అశుతోష్ శర్మ తన బృందంతోపాటు ఎస్ఐ షకీల్ అహ్మద్ ఖ్వాజీతో కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదులు 11 మంది పౌరులను బందీగా పట్టుకొని వారి ఇంట్లోనే తలదాచుకున్నట్లు బలగాలు గుర్తించాయి. దీంతో ఇంటి పక్కనే ఉన్న పశువుల పాకలోనికి బలగాలు వెళ్తుండగా గుర్తించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ సందర్భంగానే పౌరులకు ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించింది. కానీ దురదృష్టవశాత్తూ కాల్పుల్లో సైన్యానికి చెందిన కర్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, జవాన్లు రాజేశ్, దినేశ్, ఎస్ఐ ఖ్వాజీ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి సైనికాధికారులు అశుతోష్ శర్మకు కాల్ చేయగా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు మరో బృందాన్ని ఛాంగిముల్లా గ్రామానికి తరలించారు. అక్కడి చేరుకున్న ఈ బృందం ఆపరేషన్లో పాల్గొన్న ఐదుగురు మరణించారని గుర్తించింది. అలాగేఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
మీ త్యాగం మరువలేనిది: ప్రధాని మోదీ
హంద్వారాలో వీరమరణం పొందిన మన సైనికులకు, భద్రతా సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వారి శౌర్యం, త్యాగాన్ని దేశమెన్నడూ మరువబోదన్నారు. ఎంతో నిబద్ధతో వారు దేశానికి సేవ చేశారని, ప్రజల రక్షణ కోసం అలుపెరుగని పోరాటం సాగించారని కొనియాడారు. వారి కుటుంబాలకు, మిత్రులకు తన సంతాపాన్ని తెలియజేశారు. కశ్మీర్ ప్రజల ప్రాణాలు రక్షించడంలో భద్రతా బలగాల దృఢ సంకల్పాన్ని ఈ ఆపరేషన్ చాటిచెప్పిందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. వీరసైనికులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
రెండు దశాబ్దాల్లో ఇద్దరు కమాండింగ్ ఆఫీసర్లు
ఉగ్రవాదుల ఏరివేతలో కీలకపాత్ర పోషిస్తున్న 21 రాష్ట్రీయ రైఫిల్స్ గత రెండు దశాబ్దాల్లో ఇద్దరు కమాండింగ్ ఆఫీసర్లను కోల్పోయింది. 2000 ఆగస్టు 1న కర్నల్ రాజిందర్ చౌహాన్ వీరమరణం పొందగా, తాజాగా జరిగిన హంద్వారా ఎన్కౌంటర్లో కర్నల్ అశుతోశ్ వర్మ సైతం అమరుడయ్యారు. 300 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి 21 రాష్ట్రీయ రైఫిల్స్ ‘ట్రిపుల్ సెంచూరియన్స్' అని పేరుపొందింది.