విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో కరోనా రికవరీ రేటు పెరిగింది. యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ కేసులు అధికంగా ఉన్నాయి. ఏపీలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదవ్వగా, నిన్న ఒక్కరోజే 73 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కి చేరగా, ఇప్పటివరకు 998 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 45 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 975 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.
గడిచిన 24 గంటల్లో 7409 శాంపిల్స్ను పరీక్షించగా.. 38 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా అనంతపురం జిల్లాలో 8, చిత్తూరు జిల్లాలో 9(8 మంది తమిళనాడు నుంచి వచ్చిన వారు), గుంటూరు జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 9 కరోనా కేసులు నమోదయ్యాయి.