కరోనాను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించటంలో తొందరపడిందన్న విమర్శలు వినిపిస్తున్నవేళ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రభుత్వ చర్యలను సమర్థించింది. ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉన్న సమయంలో భారత్ కరోనా బారినపడిందని ఐఎంఎఫ్ ఆసియా పసిఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ చాంగ్ యోంగ్ రీ అన్నారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవటం కష్టతరమైనప్పటికీ లాక్డౌన్ ప్రకటించే విషయంలో భారత ప్రభుత్వ చర్యలను తాము సమర్థిస్తున్నట్లు వెల్లడించారు.
కరోనా సంక్షోభం ప్రభావం ఆసియా పసిఫిక్ దేశాలపై తీవ్రంగా ఉండనుందని రీ పేర్కొన్నారు. గత 60 ఏండ్ల నుంచి ఆసియా ఖండ ఆర్థిక వృద్దిరేటు ఎన్నడూ 0కు పడిపోలేదని, ఇప్పుడు కూడా ఇతర ఖండాలకంటే ఆసియా ఖండ వృద్ధిరేటు ఎక్కువగానే ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు ఆశాజనకంగా ఉంటుందని చెప్పలేమన్నారు.