ఆరోగ్యసేతుతో ఆ ప్రమాదం లేదు -నీతి ఆయోగ్

దేశంలో కరోనా వ్యాధికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు, అనుమానితులను గుర్తించేందుకు కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్యసేతు యాప్‌పై వస్తున్న అనుమానాలను నీతీ ఆయోగ్‌ తోసిపుచ్చింది. ఈ యాప్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని నీతీ ఆయోగ్‌ టెక్నికల్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ అర్నబ్‌కుమార్‌ స్పష్టంచేశారు. ఈ యాప్‌లో రిజస్టర్‌ చేసుకున్న వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని తాము పరిశీలించబోమని, కేవలం కోవిడ్‌-19 వైరస్‌ సోకిన వ్యక్తులను గుర్తించేందుకు మాత్రమే సమాచారాన్ని తీసుకుంటామని తెలిపారు. ఇందులో ఏర్పాటు చేసిన జీపీఎస్‌ ట్రాకర్‌ కూడా అందుకోసం ఉద్దేశించినదేనని వెల్లడించారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ కూడా విజ్ఞప్తి చేయటంతో రెండువారాల్లోనే దేశవ్యాప్తంగా 5కోట్ల మంది తమ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.