సమస్యంతా అక్కడే!

  • ముంబై, కోల్‌కతా, జైపూర్‌, ఇండోర్‌ నగరాల్లోనే

  • పశ్చిమ బెంగాల్‌లోనే ఉల్లంఘనలు ఎక్కువన్న కేంద్రం

  • కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల జాబితా విడుదల

    కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో దేశ వాణిజ్య రాజధాని ముంబైతోపాటు పుణె, (మహారాష్ట్ర), మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, రాజస్థాన్‌లోని జైపూర్‌, పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై వివిధ వర్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత ఈ జాబితా రూపొందించినట్టు కేంద్రం తెలిపింది. ఇందులో పశ్చిమబెంగాల్‌లోనే ఎక్కువ ప్రాంతాలున్నాయి. రాజధాని కోల్‌కతాతోపాటు హౌరా, ఈస్ట్‌ మిడ్నాపూర్‌, ఉత్తర 24 పరగణాలు, డార్జిలింగ్‌, కాలింపోంగ్‌, జల్‌పాయ్‌గురి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లాక్‌ డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయని,  వైద్యసిబ్బంది, పోలీసులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. హాట్‌స్పాట్‌ జిల్లాల్లో ఇలాగే కొనసాగితే పరిస్థితి చేయిదాటిపోతుందని హెచ్చరించింది. ఆ ప్రాంత ప్రజలతోపాటు దేశంలోని మిగతావారికీ ఇబ్బందికరమేనని చెప్పింది. నిబంధనల అమలు పర్యవేక్షణకు తక్షణమే ఆరు నిపుణుల బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. మూడు రోజుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చి బెంగాల్‌లో పర్యటిస్తారని పేర్కొన్నది. పరిస్థితి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పరిశీలిస్తారని, ఏయే చర్యలు తీసుకోవాలో సూచిస్తూ కేంద్రానికి నివేదిక అందిస్తారని వెల్లడించింది. కేంద్ర జాబితాపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దేని ఆధారంగా ఈ జాబితాను రూపొందించిందో అర్థం కావడం లేదని ట్వీట్‌ చేశారు. 


    కేసులు గుర్తించడం పెను సవాల్‌ 


    పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని నిపుణులు చెప్తున్నారు. ఇది ఆందోళనకరమైన అంశమన్నారు. దీంతో కరోనా బాధితులను గుర్తించడం అధికార యంత్రాంగానికి పెద్ద సవాలుగా మారిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రామన్‌ ఆర్‌ గంగఖేద్కర్‌ తెలిపారు. 


    ఆరు నగరాల్లోనే సగం కేసులు


    దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో 50 శాతం కేవలం ఆరు నగరాల్లోనే ఉన్నట్టు తేలింది. జాబితాలో హైదరాబాద్‌తోపాటు  ముంబై (మహారాష్ట్ర), ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌), కొర్బా (చత్తీస్‌గడ్‌), రాంచి (జార్ఖండ్‌), ఖుర్దా (ఒడిశా) నగరాలు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 46 శాతం 18 జిల్లాల్లోనే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలోని 736 జిల్లాలకుగానూ.. 325 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు  నమోదు కాకపోవడం విశేషం. అంటే 44 శాతం ప్రాంతం కరోనారహితంగా ఉన్నది. తెలంగాణలోని వరంగల్‌ రూరల్‌, యాదాద్రి-భువనగిరి, వనపర్తి, సిద్దిపేట జిల్లాలున్నాయి.