వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 7 లక్షల 92 వేలు దాటింది. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో 42,514 మంది మృతి చెందారు. అమెరికాలో నిన్న ఒక్కరోజే 1939 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
అదృశ్య శత్రువు దాడి నుంచి తప్పించుకునేందుకు, అదే విధంగా అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడుకునేందుకు అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తున్నట్లు ట్రంప్ ట్వీట్ చేశారు.
కరోనా వ్యాప్తిపై తెలిసీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు తేలితే చైనాపై తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కరోనా గుట్టు విప్పేందుకు తమ దర్యాప్తు బృందాన్ని వుహాన్కు పంపాలనుకుంటున్నామని చెప్పారు. ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చైనాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అక్కడకు వెళ్లడంపై చాలా కాలం కిందటే చైనాను కోరాం. మేం అక్కడి వెళ్లాలనుకుంటున్నాం. అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలనుకుంటున్నాం. కానీ చైనా మమ్మల్ని అనుమతించడంలేదు’ అని తెలిపారు.