డబ్ల్యూహెచ్‌ఓపై కన్నెర్ర



  • నిధులు నిలిపివేసిన అమెరికా

  • కరోనా అంశంలో ఘోరవైఫల్యం

  • చైనా నివేదికలనే గుడ్డిగా నమ్మింది: ట్రంప్‌

  • తప్పుబట్టిన ఐరాస, పలు దేశాలు




ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు తమ వంతు వాటా నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ప్రాథమిక విధులు, తప్పనిసరి బాధ్యతలను నిర్వహించడంలో విఫలమైన డబ్ల్యూహెచ్‌ఓ పనితీరును సమీక్షిస్తామన్నారు. మంగళవారం ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ తీవ్రంగా విఫలమైందన్నారు. ‘డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహణలో ప్రధాన పోషకురాలు అమెరికా. ఆ సంస్థ బాధ్యతాయుతంగా తన విధులు నిర్వర్తించేలా అమెరికా కచ్చితంగా చర్యలు చేపడుతుంది’ అని తెలిపారు. ‘చైనా నుంచి ఇతర దేశాలకు ప్రయాణికులపై విధించిన ఆంక్షలను డబ్ల్యూహెచ్‌ఓ ఘోరంగా వ్యతిరేకించింది’ అని ఆరోపించారు. అంతర్జాతీయ ఆరోగ్య ముప్పు విషయమై ప్రపంచ దేశాలన్నీ డబ్ల్యూహెచ్‌ఓ సమాచారంపైనే ఆధారపడతాయని ట్రంప్‌ చెప్పారు. కానీ వుహాన్‌లో పరిస్థితులపై వచ్చిన నివేదికల్లో విశ్వసనీయతపై దర్యాప్తు చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని, చైనా అధికారిక సమాచారంపైనే ఆధారపడిందన్నారు. మరోవైపు, డబ్ల్యూహెచ్‌ఓకు నిధులను ట్రంప్‌ నిలిపివేయటంపై జర్మనీ విదేశాంగశాఖ మంత్రి హైకో మాస్‌ బుధవారం స్పందిస్తూ.. వైరస్‌కు సరిహద్దుల్లేవని, ఇతరులను నిందించడంతో ప్రయోజనం లేదని ట్వీట్‌ చేశారు.