మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 47వ పుట్టిన రోజు ఇవాళ. ప్రపంచ క్రికెట్లో మేటి బ్యాట్స్మెన్గా కీర్తిగాంచిన సచిన్కు .. బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం లాక్డౌన్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో సచిన్ తన ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇంట్లోనే ఉండడంతో వంట చేస్తున్నాను, చెట్లకు నీళ్లు పోస్తున్నాను, పిల్లలు సారా, అర్జున్తో ఎక్కువ సమయం గడుపుతున్నాను, లాక్డౌన్ వల్ల వారితో ఎక్కువ సేపు ఉండే వీలు కలుగుతోందని సచిన్ తెలిపారు.
సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల ప్రాయంలోనే పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మాన్ తరహాలో తన కెరీర్లో పరుగుల సునామీ సృష్టించాడు. గాడ్ ఆఫ్ క్రికెట్గా ఖ్యాతిగాంచిన సచిన్.. 2012 డిసెంబర్లో తన అంతర్జాతీయ వన్డే కెరీర్కు గుడ్బై చెప్పాడు. అక్టోబర్ 2013లో ట్వెంటీట్వెంటీ క్రికెట్కు స్వస్తి పలికాడు. ఇక అన్ని ఫార్మాట్ల క్రికెట్కు సచిన్ 2013లో ఫుల్స్టాప్ పెట్టేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో 200వ టెస్టు ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరగులు సాధించిన క్రికెటర్గా తన కెరీర్ను ముగించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 34,457 రన్స్ చేశాడు. 200 టెస్టుల్లో 15,921 పరుగులు, 463 వన్డేల్లో 18426 రన్స్, ఒక టీ20లో పది రన్స్ చేశాడతను. వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన తొలి క్రికెటర్గా సచిన్ నిలిచాడు. 2010, ఫిబ్రవరి 24వ తేదీన గ్వాలియర్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అతను 147 బంతుల్లో 200 స్కోర్ చేశాడు. రికార్డు స్థాయిలో అతను ఆరు ప్రపంచ కప్ల్లో ఆడాడు.
ప్రస్తుతం కోవిడ్19 నేపథ్యంలో సచిన్ .. బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం లేదు. డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, పోలీసుల, డిఫెన్స్ ఉద్యోగులకు ఇప్పుడు నివాళి అర్పించే సమయం అన్నారు. సచిన్ టెండూల్కర్ ఇప్పటికే మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు 50 లక్షలు అందజేశారు. పలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ 24 ఏళ్లపాటు టీమిండియాకు సేవలు అందించాడు.