నమస్తే ట్రంప్.. మీది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. మాది స్టాట్యూ ఆఫ్ యూనిటీ’

మోతెరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్, అమెరికా సంబంధాలు ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాక్షించారు. నమస్తే ట్రంప్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. అప్పుడు హౌడీ మోదీ.. ఇప్పుడు నమస్తే ట్రంప్.. ఇది కొత్త చరిత్రకు శ్రీకారమని అభివర్ణించారు.అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మీకు స్వాగతం పలుకుతోందని, మోతెరా స్టేడియం సరి కొత్త చరిత్రకు నాందిపలికిందన్నారు.మీది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయితే.. మాది స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని అన్నారు. భారత్, అమెరికాలు అనేక విషయాల్లో సహకరించుకుంటున్నాయని అన్నారు. మీకు అతిథ్యం ఇవ్వడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ట్రంప్‌నకు గుజరాత్‌ మాత్రమే కాదు.. యావద్దేశం స్వాగతం పలుకుతోందని మోదీ అన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన సబర్మతి నది ఒడ్డున ఉన్నారు.. వైవిధ్యభరితమైన భారతదేశానికి విచ్చేశారు.. అనేక భాషలు, విభిన్న సంప్రదాయాలు, విభిన్న రుచులు, విభిన్న సంస్కృతి, అనేక మతాలకు నిలయమై భిన్నత్వంలో ఏకత్వాన్ని తమ దేశం చాటుకుంటోందని మోదీ అన్నారు.
హ్యూస్టన్‌లో హౌడీ మోదీ కార్యక్రమానికి కొనసాగింపుగానే ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం నిర్వహించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అంతకు ముందు మోతెరా మైదానం వేదికపైకి చేరుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియా, ప్రధాని మోదీ స్టేడియానికి విచ్చేసిన లక్షలాది మంది ప్రజలకు అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్‌ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

భారత్‌ శక్తిసామర్థ్యాల పట్ల ట్రంప్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలకు ధన్యవాదాలు.. మహాత్మాగాంధీ, పటేల్‌, వివేకానంద గురించి ప్రస్తావించడం గర్వకారణంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ స్టేడియం గురించి మీరు అన్న ప్రతిమాట క్రీడాకారుల్లో స్ఫూర్తిని రగలిస్తుందని, స్నేహానికి పునాది విశ్వాసం, ఈ స్నేహం చిరకాలం కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశఆరు. భారత్‌, అమెరికాల మైత్రి మరింత దృఢపడిందని, ఇది కొత్త తీరాలకు చేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.