రూ.2 వేల నోటు : ఆర్థికమంత్రి కీలక ప్రకటన

న్యూఢిల్లీ: రూ. 2వేల నోటు కనుమరుగు కానుందన్న వార్తలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. రూ.2వేల నోట్ల జారీని నిలిపివేయాల్సిందిగా బ్యాంకులకు తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదని ఆమె స్పష్టం చేశారు. బుధవారం వివిధ ప్రభుత్వ బ్యాంకుల కీలక అధికారులతో సమావేశమైన నిర్మలా సీతారామన్‌ ఈ వివరణ ఇచ్చారు. తనకు తెలిసినంతవరకు, బ్యాంకులకు అలాంటి సూచనలేమీ ఇవ్వలేదంటూ తాజా పుకార్లను కొట్టి పారేశారు. 2 వేల రూపాయల విలువైన నోట్లు చట్టబద్ధంగా చలామణిలో వుంటాయని, ఈ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని నిర్మలా సీతారామన్‌ సూచించారు.


కాగా దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను  కేంద్రం గతంలో రద్దు చేసినట్టుగానే తాజాగా రూ.2 వేల నోట్లను కూడా ఉపసంహరించుకోనుందని, ఈ నేపథ్యంలోనే చాలా బ్యాంకులు ఏటీఎంలలో రూ.2 వేలు ఉంచడంలేదని, దీనికి బదులు రూ.500 నోట్లనే ఉంచుతున్నాయన్న వార్తలు గత కొన్ని రోజులుగా హల్‌ చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.